విండీస్‌తో టీ20 సిరీస్.. రింకూసింగ్ ఎంట్రీ!

  • రేపు భారత్-ఆసీస్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం
  • ఆ తర్వాత భారత జట్టు విండీస్ పర్యటన
  • టీ20 సిరీస్‌ నుంచి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి
  • ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు చోటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అదరగొట్టిన రింకూసింగ్‌‌కు‌ టీమిండియాలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) ప్రారంభం అవుతుంది. ఇది ముగిసిన తర్వాత భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. 

టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, అశ్విన్, షమీకి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్న సెలక్టర్లు ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రింకూసింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్‌శర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటివ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే, పేసర్ మోహిత్‌శర్మ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. టీ20 సిరీస్‌కు హార్ధిక్‌పాండ్యా నాయకత్వం వహించనుండగా సూర్యకుమార్‌యాదవ్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

Rinku Singh
Team India
West Indies
WTC Final
Yashasvi Jaiswal

More Telugu News